సాక్షి,లక్నో: రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ సొంతంగా మెజారిటీ సాధించాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. 2019 లోక్సభ ఎన్నికల్లో జయభేరి మోగించేందుకు యూపీ కీలకం కావడంతో ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిసారించింది. 2014 ఎన్నికల్లో యూపీలోని ఏడు లోక్సభ సెగ్మెంట్లలో బీజేపీ పరాజయం పాలైంది. వీటిలో అయిదు ఎస్పీ గెలుచుకోగా, కాంగ్రెస్ కేవలం రెండు లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపొందింది. అమేథి, రాయ్బరేలి నుంచి రాహుల్, సోనియాలు విజయం సాధించారు.
ఈ ఏడు నియోజకవర్గాలపై ఇప్పుడు బీజేపీ ఫోకస్ పెట్టింది. వీటిలో వీలైనన్ని ఎక్కువ స్ధానాలను గెలుపొందాలని పార్టీ భావిస్తున్నట్టు యూపీ బీజేపీ ప్రతనిధి రాకేష్ త్రిపాఠి చెప్పారు. గత ఎన్నికల్లో యూపీలోని 80 ఎంపీ సీట్లకు గాను బీజేపీ 73 స్ధానాల్లో జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గాలకు పార్టీ తరపున ఇన్చార్జిలను నియమించడంతో పాటు బూత్ స్థాయిలో పలు కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నట్టు త్రిపాఠి తెలిపారు. అభివృద్ధికి కట్టుబడ్డ బీజేపీకి అండగా నిలవాలని ఈ నియోజకవర్గాల్లో ఓటర్లకు బీజేపీ నేతలు గట్టి సందేశం పంపుతారని చెప్పారు.